అగ్ర కథానాయిక సమంతలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. తరచూ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తూ ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకుంటుంది. త్వరలో ఆమె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత ఇటీవలే కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించింది. గత కొన్నేళ్లుగా ఆమె ఈ కేంద్రంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును ఇక్కడే వివాహం చేసుకుంది. ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించిన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత.
ఐదేళ్ల క్రితం ఈశా కేంద్రంలో అడుగుపెట్టిన రోజు నుంచి తన జీవిత దృక్కోణం మొత్తం మారిపోయిందని ఆనందం వ్యక్తం చేసింది. కొత్త విషయాల్ని తెలుసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత విస్తృతపరచుకోవడానికి ఇదొక వేదికలా ఉపయోగపడిందని చెప్పింది. ‘మన జీవితాన్ని ఆనందమయం చేసే వ్యక్తుల్ని కలవడం, ప్రదేశాన్ని సందర్శించడం గొప్ప అనుభవం. నా బలాలు, బలహీనతలు, పరిమితులు ఏమిటో ఈ ప్రయాణంలో తెలుసుకున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతీసారి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనే భావన కలుగుతుంది’ అని సమంత తన పోస్ట్లో పేర్కొన్నది.