Samantha | సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ అల్లుఅర్జున్, రష్మిక జంటగా నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘పుష్ప’. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది. ఈ చిత్రంలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా..’ ఐటెం సాంగ్ సినిమాకే హైలెట్గా నిలిచింది.
ప్రస్తుతం మేకర్స్ ‘పుష్ప-2’ సీక్వెల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్లో సుకుమార్ ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. ఐటెమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆఫర్ను సామ్ తిరస్కరించిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితి, బిజీ షెడ్యూల్ కారణంగా నటించలేనని సమంత చెప్పినట్టుగా పలు వెబ్సైట్లలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు సమంత టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. నిజానికి పుష్ప-2లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సమంతను సంప్రదించనేలేదని తెలిపింది.
సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ నుంచి కోలుకుంటోంది. ‘యశోద’ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సామ్.. ఇంట్లోనే మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. తాజాగా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటోంది. మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమా షూటింగ్లోనూ జాయిన్ కానుంది. ఇక సమంత నటించిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ డేట్ను పోస్ట్ పోన్ చేసుకుంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రావాల్సిన శాకుంతలం ఏప్రిల్ 14కు వాయిదా పడింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన ట్రైలర్ విపరీతమైన ఆసక్తి నెలకొల్పింది.