అగ్ర కథానాయిక సమంత నూతనోత్తేజంతో కనిపిస్తున్నది. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ద్విగుణీకృతమైన ఉత్సాహంతో సెట్స్లో సందడి చేస్తున్నది. ఇప్పటికే హిందీ వెబ్సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్లో బిజీగా ఉన్న సమంత తాజాగా తెలుగు చిత్రం ‘ఖుషి’ సెట్లో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
బుధవారం సెట్లో అడుగుపెట్టిన సమంతకు చిత్ర బృందం ఘనస్వాగతం పలికింది. చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసిన సమంత చాలా ఉత్సాహంగా కనిపించింది. సమంత మయోసైటిస్ బారిన పడటంతో గత ఏడాది ‘ఖుషి’ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. సుదీర్ఘ విరామం తర్వాత షూటింగ్ పునః ప్రారంభం కావడంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.