భూతల స్వర్గసీమ హిమాలయాల్ని సందర్శించడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి హిమాలయాల పర్వతపంక్తుల్లో చార్ధామ్ యాత్రలో పాల్గొంది. ఆ విశేషాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. యాత్ర ముగింపు సందర్భంగా సమంత హిమాలయాల్లో తన ఆనందానుభూతిని వర్ణిస్తూ ఓ పోస్ట్ చేసింది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాల గురించి ప్రేమను పెంచుకున్నానని చెప్పింది. ‘భువిపై కొలువైన స్వర్గమిది. ఎన్నో నిగూఢమైన రహస్యాల్ని దాచుకున్నట్లుగా కనిపిస్తుంది. దేవుళ్లు తిరుగాడే అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రశాంత వాతావరణం, హిమాలయాల మార్మిక సౌందర్యం నన్ను మంత్రముగ్ధురాలిని చేశాయి. భ్రమకు, నిజానికి మధ్య ఓ సుందరలోకంలో విహరించిన అనుభూతి కలిగింది’ అంటూ కవితాత్వకంగా హిమాలయాల గురించి వర్ణించింది. సమంత తెలుగులో నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది.