కొన్నేళ్ల క్రితం ఓ స్థలం కొనుగోలు కోసం పెట్టిన పెట్టుబడి వల్ల తీవ్రంగా నష్టపోయానని, అప్పటి తన సంపాదనలో 70 శాతం మేరకు కోల్పోయానని చెప్పారు బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ-2’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కథానాయిక రాణీముఖర్జీతో కలిసి ఓ చర్చలో పాల్గొన్నారు సైఫ్అలీఖాన్. ఈ సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ యూట్యూబ్లో పంచుకుంది. ఆ రియల్ఎస్టేట్ సంస్థ మూడేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మబలికి మోసగించారని సైఫ్అలీఖాన్ తెలిపారు. ‘ఆ స్కామ్లో నేను సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నా. ఆ కుంభకోణం తాలూకు ప్రభావం నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అయినా అధైర్యపడకుండా కెరీర్పై దృష్టిపెట్టి పోయిన డబ్బుల్ని తిరిగి సంపాదించుకున్నా’ అని సైఫ్ అలీఖాన్ పేర్కొన్నారు.