కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నంకృష్ణ దర్శకుడు. ప్రముఖ నిర్మాత ఏం.ఎం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కాలేజీ పూర్తయిన తర్వాత జీవితం గురించి యువతరం తాలూకు ఆలోచనలను ఈ సినిమాలో ఆవిష్కరించాం. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. దర్శకుడిగా నా తొలి సినిమా ‘నీ మనసు నాకు తెలుసు’ తర్వాత తెలుగులో ‘ఆక్సిజన్’ చేయడానికి 15ఏండ్లు పట్టింది.
ఈ గ్యాప్లో నాన్నకు ప్రొడక్షన్లో సహకారం అందించా. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్బాల్ ఈ సినిమా అనుకుంటున్నా. తప్పకుండా కొట్టి చూపిస్తా’ అన్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే చిత్రమిదని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. తాను నిర్మించే ప్రతీ సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటుందని, భవిష్యత్తులో కిరణ్ అబ్బవరంతో మరో సినిమా చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని ఏం.ఎం.రత్నం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్ కేవీ, హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు.