షూటింగ్ లొకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. భారత్లోని కశ్మీర్, కేరళ వంటి ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు నెలవని చెప్పారు అగ్ర హీరో రామ్చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ ఆడియెన్స్కు చేరువైన ఆయన ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ రంగం తరపున ప్రతినిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్చరణ్ మాట్లాడుతూ ‘కశ్మీర్ వంటి మనోహరమైన ప్రదేశంలో ఈ సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇండియాలో కూడా విదేశాలతో సరితూగే లొకేషన్స్ ఉన్నాయి. మన భారతదేశ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన ఉంది. ఇక నుంచి నా సినిమా షూటింగ్స్ అన్నీ ఎక్కువ శాతం ఇండియాలోనే జరగాలని కోరుకుంటున్నా. కేవలం లొకేషన్ల కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో నేను హాలీవుడ్ సినిమాలో భాగమైనా భారత్లో మాత్రమే షూటింగ్ జరపాలనే షరతు పెడతాను’ అన్నారు. ప్రస్తుతం దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలు అనే భేదాలు చెరిగిపోతున్నాయని భారతీయ సినిమా ఏకోన్ముఖంగా ఎదుగుతున్నదని రామ్చరణ్ పేర్కొన్నారు.