Rohit Shetty | బాలీవుడ్లో మరోసారి అండర్ వరల్డ్ భయం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య అనంతరం ఇప్పటికీ పరిశ్రమలో ఉద్రిక్తత నెలకొన్న వేళ, తాజాగా ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న గ్యాంగ్స్టర్ శుభం లోంకర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ఆ పోస్ట్లో రోహిత్ శెట్టిని మాత్రమే కాకుండా మొత్తం బాలీవుడ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. “తదుపరి బుల్లెట్ ఇంటిని కాదు… ఛాతీని తాకుతుంది” అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ వర్గాల్లో భయం నెలకొంది. మొదట ఈ కాల్పుల ఘటనను కేవలం బెదిరింపు చర్యగా భావించినా, శుభం లోంకర్ పేరుతో బయటకు వచ్చిన సందేశం తర్వాత విషయం మరింత తీవ్రమైందని స్పష్టమైంది. ఆ పోస్టులో “రోహిత్ శెట్టి ఇంట్లో జరిగిన కాల్పులకు మేమే బాధ్యత వహిస్తున్నాం. ఎన్నిసార్లు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా వినకపోతే తదుపరి బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దూసుకుపోతుంది. బాలీవుడ్ మారకపోతే బాబా సిద్ధిఖీ కంటే దారుణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ ప్రముఖుల భద్రతపై మళ్లీ సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
శుభం లోంకర్ ప్రస్తుతం ముంబై పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన అతను గత కొన్ని సంవత్సరాలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో కీలక వ్యక్తిగా ఎదిగినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. బాబా సిద్ధిఖీ హత్య కేసులో కూడా అతని పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిపిన వారికి ఆయుధాలు సమకూర్చడం, వారిని లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్తో అనుసంధానం చేయడంలో అతను కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.శుభం లోంకర్ సాధారణ నేరస్థుడు కాదని, గ్యాంగ్కు టెక్నికల్ మరియు సోషల్ మీడియా మేనేజర్లా వ్యవహరిస్తున్నాడనే సమాచారం కూడా వెలుగులోకి వస్తోంది. అకోలాలో ఒకప్పుడు పాల వ్యాపారం నిర్వహించిన అతను, క్రమంగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి బిష్ణోయ్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బహిరంగ హెచ్చరికలు జారీ చేసే స్థాయికి ఎదగడం భద్రతా వ్యవస్థలకే సవాల్గా మారింది.