Rimi Sen | ‘ధూమ్’, ‘హంగామా’, ‘ఫిర్ హేరా ఫేరీ’ వంటి సూపర్ హిట్ సినిమాలతో 2000వ దశకంలో బాలీవుడ్ యువతను ఆకట్టుకున్న అందాల నటి రిమీ సేన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న రిమీ సేన్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కెరీర్ ప్రారంభంలో జాన్ అబ్రహం ఒక మోడల్ మాత్రమేనని, అతనికి నటన అస్సలు రాదని రిమీ సేన్ స్పష్టంగా చెప్పడం గమనార్హం. అయితే తన పరిమితులను అర్థం చేసుకుని తెలివిగా పాత్రలు ఎంచుకోవడం వల్లే జాన్ అబ్రహం స్టార్ స్థాయికి చేరుకున్నాడని ఆమె వ్యాఖ్యానించారు.
తన నటనపై విమర్శలు వచ్చినా వాటికి స్పందించకుండా, తన బాడీ, లుక్స్ హైలైట్ అయ్యేలా ఎక్కువగా యాక్షన్ సినిమాలనే ఎంచుకుని ప్రేక్షకులు వేలెత్తి చూపే అవకాశమే ఇవ్వలేదని, ఇది అతని స్ట్రాటజీ అని రిమీ సేన్ వివరించారు. ఒక్కసారి క్రేజ్ వచ్చాక కెమెరా ముందు అనుభవంతో మెల్లమెల్లగా నటన కూడా నేర్చుకున్నాడని, తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయగలిగాడని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాన్ అబ్రహం కేవలం నటుడిగానే కాకుండా మంచి బిజినెస్మ్యాన్గా కూడా ఎదిగాడని, ప్రొడక్షన్ రంగంలోకి వచ్చి కంటెంట్కు ప్రాధాన్యం ఉన్న హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడని ప్రశంసించారు. 2004లో సంజయ్ గాధ్వి దర్శకత్వంలో వైఆర్ఎఫ్ బ్యానర్పై వచ్చిన ‘ధూమ్’ సినిమా అప్పట్లో బాలీవుడ్లో సంచలనం సృష్టించిందని, అదే యాక్షన్ ఫ్రాంచైజీకి బీజం వేసిందని రిమీ సేన్ గుర్తు చేశారు.
ఆ సినిమాలో అభిషేక్ బచ్చన్ భార్య పాత్రలో రిమీ సేన్ నటించగా, జాన్ అబ్రహం నెగెటివ్ రోల్లో అదరగొట్టాడు. ఇక జాన్ అబ్రహం తాజా చిత్రాల విషయానికి వస్తే, చివరిగా ‘టెహ్రాన్’ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్లో కనిపించి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తారిఖ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, రిమీ సేన్ తెలుగులో కూడా తన గ్లామర్తో అభిమానులను ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘అందరివాడు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రిమీ సేన్. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జాన్ అబ్రహం కెరీర్పై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.