అమరావతి : ఈనెల 10న ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానితో ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీటర్ వేదిక ద్వారా తెలియజేశారు. మంత్రి పేర్నినాని తనను ఈనెల 10న సినిమా టికెట్ల ధరలపై చర్చించేందుకు రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. అమరావతి సెక్రటేరియట్ కార్యాలయంలో మధ్యాహ్నం కలిసేందుకు రావాలని కోరినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. మంత్రి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. సినీ హీరో నానితో మొదలైన వ్యాఖ్యలు ఏపీ మంత్రులు ప్రతిస్పందించగా దానికి కొనసాగింపుగా ఆర్జీవీ ఘాటుగా స్పందించారు. ఈ దశలో వాడివేడిగా ఆర్జీవీ, మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్ ద్వారా మాటల యుద్ధం కొనసాగింది. సినిమా టికెట్ ధరల పెంపుదలకు ప్రభుత్వం స్పందించడం ఏమిటని ఆర్జీవీ ప్రభుత్వాన్ని నిలదీయగా సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ధరలను తగ్గించిందని మంత్రి ప్రతి జవాబు ఇచ్చారు.
ఈనెల 10న మంత్రి స్వయాన సమావేశానికి రావాలని ఆర్జీవీని కోరిన మీదట వీరి మధ్య జరిగే చర్చలపై అటు రాజకీయంగా, ఇటు సినీ పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది .