ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో, భిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’ (My Name Is Shruthi). ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్కు చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట’ అంటూ కొనసాగే టైటిల్ లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. మార్క్రాబీన్ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ ఆలపించారు.
లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే గ్యాంగ్తో ఓ యువతి చేసే పోరాటమే మా చిత్రం అంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ (Srinivas Omkar). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika Motwani) టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్లో చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు..ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హన్సిక చెప్పే డైలాగ్తో సాగుతున్న టీజర్తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది.
ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ..ఈ చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఇలాంటి ఓ ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో వుండే ట్విస్ట్లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రంలో ఈ పాట టైటిల్ సాంగ్గా వస్తుంది. తప్పకుండా ఈ సాంగ్తో పాటు చిత్రం కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ..టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ..సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ…ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్లతో వుంటుంది అన్నారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్ప్రొడ్యూసర్: విజయ్కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.