Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వరుస వేధింపుల నేపథ్యంలో టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం, పిల్లల భవిష్యత్తు మరియు తను చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలపై కొందరు నెటిజన్లు అత్యంత దారుణమైన రీతిలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని స్వయంగా కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తనపై అత్యంత అసభ్య పదజాలంతో దాడులు చేస్తున్న నాలుగు నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలను గుర్తించిన రేణు దేశాయ్, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను సాకుగా చూపుతూ సామాజిక మాధ్యమాల్లో వేధించడం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.