పీరియాడిక్ సినిమాలు ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తాయి. గతంలోకి తీసుకెళ్లి నాటి కాలమాన పరిస్థితుల్ని, సంస్కృతిని కళ్లకు కడతాయి. ప్రభాస్ సరసన తాను నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ పీరియాడిక్ చిత్రాల్లో సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కథానాయిక పూజా హెగ్డే చెప్పింది. ఈ సినిమా తాలూకు నాయకానాయికల వింటేజ్ లుక్స్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్పరంగా భారతీయ సినిమాల్లో ‘రాధేశ్యామ్’ ప్రత్యేకంగా నిలిచిపోతుందని పూజాహెగ్డే తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘భారతీయ నేపథ్యంలో గతంలో చాలా పీరియాడిక్ సినిమాలొచ్చాయి. కానీ ఈ జోనర్లో యూరప్ నేపథ్య చిత్రాలు రాలేదు. ‘రాధేశ్యామ్’ 70దశకాల్లోని యూరోప్ను ఆవిష్కరిస్తుంది. సినిమాలోని కొన్ని డ్రీమ్ సీక్వెన్స్లో నాటి ఇటలీ సంస్కృతిని తెలియజెప్పే గౌన్స్, కోట్స్, టోపీలను ఉపయోగించారు. కాస్ట్యూమ్స్ అప్పటి రోజుల్ని గుర్తుకుతెస్తాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాలో ఇలాంటి ఫ్యాషన్ను చూపించలేదనుకుంటున్నా’ అని చెప్పింది. సినిమాల్లో పాత్ర తాలూకు స్వభావాన్ని ష్యాషన్ ప్రతిబింబిస్తుందని పూజాహెగ్డే పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘రాధేశ్యామ్’తో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకులముందుకురానుంది.