సినిమాలతో పాటు వెబ్సిరీస్లకు సమప్రాధాన్యతనిస్తూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నారు అగ్ర కథానాయికలు. ఓటీటీ వేదికల్లో వినూత్నమైన కథాంశాల్ని ఎంచుకునే స్వేచ్ఛ, పాత్రలపరంగా ప్రయోగాలకు ఆస్కారం ఉండటంతో చాలా మంది నాయికలు అటువైపు అడుగులు వేస్తున్నారు. ఈ వరుసలో చెన్నై చిన్నది రెజీనా బాలీవుడ్ వెబ్సిరీస్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే తెలుగులో ‘అనన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో తన తొలి వెబ్సిరీస్ను చేస్తున్న రెజీనా తాజాగా బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నది. వివరాల్లోకి వెళితే…‘ఫ్యామిలీమెన్’ సిరీస్తో దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు దర్శకనిర్మాతల ద్వయం రాజ్ అండ్ డీకే. ప్రస్తుతం వారు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో షాహిద్కపూర్, విజయ్సేతుపతి, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ సిరీస్లో రెజీనా కీలక పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. బాలీవుడ్లో తన ఫస్ట్ వెబ్సిరీస్ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని పేర్కొంది. రెండేళ్ల విరామం తర్వాత ఈ భామ బాలీవుడ్ ప్రాజెక్ట్లో భాగం కావడం విశేషం.