‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది మలయాళీ సుందరి రెబ్బా మోనికా జాన్. శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రెబ్బా మోనికా జాన్ మాట్లాడుతూ ‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పుట్టి పెరిగాను. మలయాళంలో నటించిన ‘ఫొరెన్సిక్’ చిత్రానికి మంచి పేరొచ్చింది. ‘సామజవరగమన’ వంటి కుటుంబ కథా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో సరయు అనే మధ్యతరగతి అమ్మాయిగా నా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది భాషల్లో కొన్ని సినిమాల్లో నటించాను. తెలుగు ఇండస్ట్రీ మాత్రం నా హృదయానికి దగ్గరగా అనిపించింది. ఈ సినిమా సక్సెస్ టూర్ కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నాపట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. తెలుగువారు చాలా ప్రత్యేకం అనే భావన కలిగింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నా’ అని చెప్పింది.