ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శర్వానం ద్ మాట్లాడుతూ…‘ట్రైలర్ బాగుంది. సినిమా లో నవ్వులు గ్యారెంటీ అనిపిస్తున్నది. మూవీ టేకింగ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆది నాకు సోదరుడి లాంటివాడు. ఈ సినిమాతో అతనికి విజయం దక్కాలి’ అన్నారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ…‘ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఉన్న చిత్రమిది. బలమైన కథను నమ్మి సినిమా చేశాం. దర్శకుడు ఫణికృష్ణ ప్రతిభావంతుడు. నిర్మాత రాజీపడకుండా సినిమాను నిర్మించారు. మా చిత్రాన్ని థియేటర్లో చూసి ఆదరించింది’ అన్నారు. ‘ఆదికి సరిపోయే సబ్జెక్ట్ ఇది. మంచి సినిమా చేసేందుకు టీమ్ కష్టపడ్డారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత కెకె రాధామోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దర్శకులు మారుతి, సంపత్ నంది తదితరులు పాల్గొన్నారు.