Eagle | ఈగల్ సినిమా ఎక్కడ వెనక్కి తగ్గింది.. ఫిబ్రవరి 9న చెప్పినట్టుగానే వస్తుందిగా అనుకుంటున్నారు కదా..? నమ్మడానికి విచిత్రంగా అనిపించినా రవితేజ వెనక్కి తగ్గిన మాట మాత్రం వాస్తవమే. దానికి కారణం కూడా హనుమాన్ సినిమానే. ఈ విషయం తెలియాలంటే దీని వెనుక కథ పూర్తిగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో సినిమా టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. తమ సినిమాకు ఎంత టికెట్ రేట్ పెడితే ప్రేక్షకులు వస్తారనే విషయం మీద డిబేట్లు కూడా బాగానే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు కూడా ఎక్కువ టికెట్ రేట్ పెడితే ప్రేక్షకులు రావడానికి అసలు ఆసక్తి చూపించడం లేదు.
ఎలాగో నెల రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా అని ఇంట్లోనే ఉండిపోతున్నారు. అలా కాకుండా నార్మల్ టికెట్ రేట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా థియేటర్కు సినిమా చూడటానికి కుటుంబంతో పాటు వస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమానే. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్లు పెంచుకోలేదు.. ప్రభుత్వానికి తమ సినిమాకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ కూడా అడగలేదు.. సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 200 రూపాయలతోనే వచ్చింది హనుమాన్. ఐమాక్స్, ఏఎంబి మాల్ లాంటి థియేటర్స్ లో మాత్రమే 295 రూపాయలు ఉంది. ఇది కాకుండా మిగిలిన థియేటర్లలో కేవలం 200 రూపాయల టికెట్ మాత్రమే ఈ సినిమాకు ఉంచారు నిర్మాతలు.
తమ సినిమాను అందరూ చూడాలి.. దానికి తోడు లాంగ్ రన్ ఉండాలి.. అందుకే నామినల్ టికెట్ రేట్లతోనే వస్తున్నట్టు ముందుగానే చెప్పారు దర్శక నిర్మాతలు. ఈ ప్లాన్ హనుమాన్ సినిమాకు బాగా వర్కౌట్ అయింది కూడా. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు అని హనుమాన్ మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈగల్ సినిమా కూడా ఇదే చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. సాధారణంగా రవితేజ లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు ఖచ్చితంగా టికెట్ రేట్లు 295 రూపాయలు ఉంటుంది. కానీ ఈగల్ సినిమా విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కీలక నిర్ణయం తీసుకుంది.
దీనికి మల్టీప్లెక్స్ లలో 200 రూపాయలు మాత్రమే రేట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు మాత్రమే ఉంది. ఇక ఏపీలో 147, 177 అలాగే కంటిన్యూ కానుంది. సినిమా బాగుంటే ఈ టికెట్ రేట్లతోనే భారీ కలెక్షన్లు వస్తాయని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. కరోనాకు ముందు ప్రతి సినిమా టికెట్ రేట్ కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని థియేటర్స్ లో మాత్రమే 200 రూపాయల టికెట్ ఉండేది. కానీ ఆ తర్వాత దాన్ని 295 రూపాయలకు పెంచడం కాకుండా.. ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ తో ఇంకో 50 రూపాయలు పెంచుకొని సామాన్యుడికి సినిమాను చాలా దూరం చేశారు.
ఇప్పుడు మళ్లీ నిర్మాతలు ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకొని బ్యాక్ టు రూట్స్ అంటున్నారు. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే ఇకపై పెద్ద సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచే ధైర్యం చేయరు నిర్మాతలు.