రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు శరత్ మండవ. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు శరత్ మండవ.
ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. సాధారణంగా ఒక మిస్సింగ్ కేసును పోలీసులు విచారణ చేస్తుంటారు. కానీ ప్రభుత్వ అధికారి రామారావు ఈ కేసును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేది కథలో కొత్తగా ఉండే అంశం.
కలెక్టరేట్తో ముడిపడి ఉండే సమస్యలన్నీ ఈ కథలో వస్తుంటాయి. అందులో ఇసుక మాఫియా కూడా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కలెక్టర్లు ఆదేశాలు ఇస్తుంటారు. అలాంటి అంశాలను కథలో ఉపయోగించాం. నేను చూసిన కొన్ని ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా.
రామారావు అనేది తెలుగులో ప్రసిద్ధమైన పేరు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ లీడర్ కేటీఆర్. ఇలా వీళ్ల పేర్లన్నీ రామారావు కదా. ఈ పేరులోనే స్ఫూర్తి ఉంది. అందుకే టైటిల్గా పెట్టాం.
రవితేజ అంటే వినోదం కోరుకుంటారు, ఈ ట్రైలర్ చూస్తే పూర్తి యాక్షన్తో ఉంది
వినోదం అంటే కేవలం కామెడీ అని అనుకోను. ప్రేక్షకులను కథలో లీనం చేసే ఏ అంశమైనా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తుంది. రవితేజ గత చిత్రాలు గుర్తుకురాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. కథ కొత్తగా ఉంటుంది.
నా వరకు కథ ఒక గుడి లాంటిది. ఆ కథను వదిలి పక్కకు వెళ్లను. ఆ కథకో నిర్మాణం ఉంటుంది. కథ రాసేప్పుడు దానికి కావాల్సినవి అదే సమకూర్చుకుంటుంది అని దర్శకరత్న దాసరి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుంటాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు. మంచీ చెడు మాత్రమే ఉంటాయి.
ఈ సినిమాలో కీలకమైన సీఐ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్ర కోసం ఎవర్ని తీసుకుందాం అనుకునేప్పుడు వేణు గుర్తొచ్చారు. ఆయన చిరునవ్వుతో సినిమా ఎంతో బాగుంటుంది. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తుంటాయి. ఆయనకు ఈ కథ చెప్పగానే ఒప్పుకున్నారు. వేణు క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది.
నాకు ఫీల్ గుడ్ చిత్రాలు చేయడం రాదు. శేఖర్ కమ్ముల తరహా సినిమాలు చేయలేను. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు రూపొందించగలను. రాజూ హిరాణీ తరహా చిత్రాలు తెరకెక్కించాలని ఉంది.