మాస్ మహరాజా రవితేజ త్వరలో ‘మాస్ జాతర’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, ప్రమోషన్లలో బిజీగా ఉన్న రవితేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ప్రత్యేకంగా నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈగల్ నా ఫేవరెట్ సినిమా. అందులో నేను చేసిన పాత్ర నా కెరీర్లో నాకు అత్యంత ఇష్టమైన పాత్ర. కానీ జనాలకు మాత్రం నచ్చలేదు. మంచి ఐడియా ఉన్నా, స్క్రీన్ ప్లే కొంచెం క్లిష్టంగా ఉండటంతో వాళ్లు కన్ఫ్యూజన్ అయ్యారు. అదే కథను సింపుల్గా చెప్పి అంటే బాగా వర్కౌట్ అయ్యేది అని అన్నారు రవితేజ.
ఇక తనకి ఇష్టమైన మరో సినిమా ‘నా ఆటోగ్రాఫ్ మెమరీస్’ గురించి కూడా చెప్పాడు. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. చాలా హృద్యంగా ఉంటుంది. కానీ అది కూడా ఆడలేదు. అలానే ‘నేనింతే’ కూడా అప్పట్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఈ రెండూ క్లాసిక్స్గా గుర్తింపు పొందాయి అని తెలిపారు. ఇలాంటి మంచి సినిమాలు మొదట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయినా, కాలక్రమేణా గొప్ప సినిమాలుగా గుర్తింపు పొందడాన్ని రవితేజ గుర్తుచేశారు. ఈగల్ కూడా ఓ రోజు క్లాసిక్గా మారవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో మళ్లీ మాస్ ఆడియన్స్ను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ట్రైలర్కు వచ్చిన స్పందన చూస్తుంటే, ఈసారి మాస్ మహారాజా పక్కా బ్లాక్బస్టర్ కోసం సెట్ అయ్యాడు అనిపిస్తుంది.
గత కొద్ది రోజులుగా రవితేజ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ వస్తున్నాడు. కాని ఎందుకో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. ఇప్పుడు మాస్ జాతరపైన రవితేజ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టైతే రవితేజ మళ్లీ ట్రాక్లో పడ్డట్టే అని చెప్పాలి. ఇక రవితేజ తన తదుపరి సినిమాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని అంటున్నారు.