‘నాటు నాటు’ అంటూ నేటి తెలుగు పాట ఎల్లలు దాటి చిందేస్తున్నది. ఆ పాటకు స్వరాల దరువేసి ఖండాతరాల్లో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగిస్తున్నారు సుస్వరాల స్వరఝరి కీరవాణి. ఆయన ప్రతిభను మెచ్చి గోల్డెన్ గ్లోబ్ మొదలుకొని వరుస అవార్డులు సలామ్ కొడుతున్నాయి. తాజాగా ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం ఆయక కీర్తిని మరింత ఇనుమడింపజేసింది. తన సుమధుర గాత్రంతో కొన్ని తరాల్ని మెప్పిస్తున్న వాణీ జయరాంను పద్మభూషణ్ అవార్డు వరించింది. సీనియర్ కథానాయిక రవీనా టాండన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనుంది.
భారత ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారానికి ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు ప్రణామాలు. అలాగే నా గురువులు కవితపు సీతన్న, కుప్పాల బుల్లిస్వామి నాయిడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా
– కీరవాణి
ప్రస్తుతం తెలుగు పాట విశ్వవేదికపై జేజేలు అందుకుంటున్నది. ‘నాటు నాటు’ అంటూ పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నది. ఆస్కార్ నామినేషన్లలో చోటు సంపాదించడం ద్వారా తెలుగు పాటను ఆస్కార్ లోగిలిలో సగర్వంగా నిలబెట్టారు ఎం.ఎం.కీరవాణి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. తాజాగా ఈ సంగీతశ్రష్టను పద్మశ్రీ పురస్కారం వరించడం ఆయన కీర్తిని మరింతగా ఇనుమడింపజేసింది. తన విలక్షణ బాణీలతో తెలుగు పాటను విశ్వయవనికపై నిలిపిన ఎం.ఎం.కీరవాణి స్వరప్రస్థానంలో ఎన్నో మరపురాని ఘట్టాలు, మజిలీలు ఉన్నాయి. ఆయన ప్రతీ పాట ఆణిముత్యమే. ప్రతి స్వరం మనోరాగరంజితమే. సంగీత దర్శకుడిగా ఆయన అధిరోహించిన కీర్తిశిఖరాలు, కనబరచిన ప్రతిభాపాటవాల గురించి చెప్పుకోవడం చర్వితచరణమే అవుతుంది. ‘మనసు-మమత’ చిత్రంతో తెలుగు సంగీత ప్రియుల హృదయాల్ని మీటిన కీరవాణి ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన అప్రతిహత స్వర ప్రయాణం సాగుతున్నది. తెలుగు పాటకు సరికొత్త నగిషీలు అద్ది స్వరరాగ ప్రపంచంలో సంగీత ప్రియుల్ని ఓలలాడించారాయన. వాణిజ్య చిత్రాల్లో కూడా తెలుగు పాట ఔన్నత్యాన్ని కాపాడుతూ విలువలతో కూడిన సంగీత సృజన చేశారు.
కేవలం సంగీత దర్శకత్వానికే పరిమితం కాకుండా గాయకుడిగా, గీత రచయితగా బహుముఖప్రజ్ఞతో మెప్పించారు. ‘క్రిమినల్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన కీరవాణి అక్కడ కూడా తనదైన ముద్రను వేశారు. కీరవాణి పాట ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అంటూ జీవన తాత్వికతను చాటిచెబుతుంది. ‘చీకటితో వెలుగే చెప్పెను’ అంటూ బతుకుపథంలో ధైర్యాన్ని నూరిపోస్తుంది. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి…’ అంటూ కుర్రకారు హృదయాన్ని ఒడిసిపడుతుంది. ఇలా కొన్ని వందల భావగర్భిత గీతాలు ఆయన స్వరకల్పనలో నిత్యనూతనమై అలరిస్తున్నాయి. 90వ దశకం నుంచి నేటి వరకు ఆయన పాట సంగీత ప్రియుల్ని మెప్పిస్తూనే ఉంది. కీరవాణి అసమాన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డుతో ఎనిమిదిసార్లు నంది పురస్కారాలు వరించాయి. పద్మశ్రీ పురస్కార ప్రకటనతో ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి జత చేరినట్లయింది.
తన సోదరుడు ఎం.ఎం.కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల మహదానందంలో ఉన్నారు అగ్ర దర్శకుడు రాజమౌళి. ఈ సందర్భంగా ట్విట్టర్లో కీరవాణితో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. ‘ఈ గుర్తింపు మీకు ఎప్పుడో వచ్చి ఉండాలని అనుకుంటున్నా. ఈ విశ్వం ప్రతి మనిషి కష్టానికి ప్రతిఫలాన్ని సరైన తరుణంలో అందిస్తుందన్న మీ తాత్వికతను నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా. ఒకవేళ నేను ఈ విశ్వంతో సంభాషించగలిగితే ‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒక ఆనందాన్ని ఆస్వాదించాక.. మరొకటి ఇవ్వు’ అని కోరతాను. అన్నయ్యకు పద్మశ్రీ పురస్కారం రావడం చాలా గర్వంగా ఉంది’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
దక్షిణాది సంగీత ప్రపంచంలో వాణీ జయరాం గళం ఎంతో విలక్షణమైనది. ఆమె పాడిన ప్రతి పాట సంగీత ప్రియుల్ని మైమరిపించింది. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరాం బాల మేధావిగా విశేషమైన ప్రతిభాపాటవాల్ని కనబరచింది. ఎనిమిదో ఏటనే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొని సత్తా చాటింది. కర్నాటక, హిందుస్థాని సంగీతాలను ఔపోసన పట్టింది. తెలుగులో స్వాతికిరణం, పెళ్లిపుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, శంకరాభరణం, మరో చరిత్ర వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ ‘ఒక బృందావనం’ ‘తెలిమంచు కరిగింది’ వంటి పాటలు సంగీత ప్రియుల్ని ఓలలాడించాయి. పద్నాలుగు భాషల్లో ఎనిమిది వేలకు పైగా పాటలు పాడారు వాణీ జయరాం.
పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన సీనియర్ కథానాయిక రవీనా టాండన్ తొంభై దశకంలో అందం, అభినయంతో కుర్రకారును ఉర్రూతలూగించింది. తొలుత గ్లామర్ నాయికగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం వరుస విజయాలతో అగ్ర తారగా ఎదిగింది. 2001లో ‘దమన్’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.