ViRoshWedding | రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ వేడుకకు ఉదయ్పూర్ నగరం ముస్తాబైంది. ఫిబ్రవరి 26న జరగనున్న ఈ వేడుక కోసం ఇప్పటికే సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. నేడు ఉదయం ఉదయ్పూర్ విమానాశ్రయంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ సందడి చేశారు. నగరానికి దూరంగా ఉన్న ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’లో అత్యంత ప్రైవేటుగా ఈ వివాహం జరగబోతున్నట్లు సమాచారం.
ఈ వేడుకకు కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. అభిమానులు ముద్దుగా ‘విరోష్’ అని పిలుచుకునే ఈ జంట పెళ్లి వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇప్పటికే ఆటపాటలతో సందడి మొదలవ్వగా, మంగళవారం సాయంత్రం మెహందీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. అత్యంత వైభవంగా, ఏకాంతంగా సాగుతున్న ఈ వేడుకల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.