Mysaa | తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాళ్లైనా స్వీకరించే కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు. మరోసారి ఆమె తన నటనపై ఉన్న అంకితభావాన్ని నిరూపిస్తూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక చేస్తున్న పాత్ర, అందుకు ఆమె పడుతున్న కష్టం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనున్నారు. ఇది సాధారణ గ్లామర్ పాత్ర కాకుండా, భావోద్వేగాలు, కోపం, ఆవేశం కలగలిపిన బలమైన పాత్రగా దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
దర్శకుడు రవీంద్ర పుల్లె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక చేసిన సాహసోపేత స్టంట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద ఒక కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. ఆ సీన్లో భాగంగా రష్మిక ఎలాంటి డూప్ లేకుండా దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసినట్లు చెప్పారు. ఈ స్టంట్ సమయంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలు అయినప్పటికీ, ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ కొనసాగించారని వెల్లడించారు. ఆమె అంకితభావం చూసి యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యానికి గురయ్యారని దర్శకుడు పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదకర సన్నివేశాలకు డూప్లను ఉపయోగిస్తుంటారు. కానీ రష్మిక మాత్రం స్వయంగా చేయడం ఆమె డెడికేషన్కు నిదర్శనమని అన్నారు.
ఇక ఈ సినిమాకోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో బ్యాంకాక్లో వారం రోజుల పాటు రోజుకు ఎనిమిది గంటల చొప్పున కఠినమైన ట్రైనింగ్ పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు. మార్షల్ ఆర్ట్స్తో పాటు గిరిజనుల పోరాట విధానాలను కలిపి ఈ చిత్రానికి కొత్త యాక్షన్ శైలిని రూపొందించినట్లు చెప్పారు. ‘మైసా’ చిత్రం యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తుందని, రష్మిక కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె చేసిన ఈ సాహసం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విడుదల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.