సుందర కూర్గ్ పర్వతప్రాంతం నుంచి మొదలైన తన ప్రయాణం నేడు జాతీయస్థాయికి చేరుకోవడం ఓ అందమైన కలలా అనిపిస్తున్నదని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఐదేళ్లక్రితం తన సినీరంగ ప్రవేశం జరిగిందని..అప్పటి నుంచి కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో వరుస అవకాశాలతో కెరీర్ ఉత్సాహంగా సాగిపోతున్నదని ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఐదేళ్లలో ఏవో కొన్ని వారాలు మాత్రమే తన స్వగృహంలో గడిపానని, నిర్విరామమైన ఈ పరుగులో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నానని రష్మిక మందన్న తెలిపింది. నేషనల్ క్రష్ అంటూ తనను అభివర్ణించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, తన నవ్వుకి యువతరం ఫిదా అయిపోతున్నారని చెప్పడం అమితానందాన్ని కలిగిస్తున్నదని రష్మిక చెప్పుకొచ్చింది. బహుభాషల్లో సినిమా చేయడంతో ప్రతి భాషలో ప్రావీణ్యం సంపాదించానని, ఓ భాషను ఆకళింపు చేసుకోలేనప్పుడు పాత్రకు న్యాయం చేయలేమని రష్మిక వివరించించింది. ప్రతి భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటానని, అందుకే ప్రేక్షకులు తనను తమ ఆడబిడ్డలా ఓన్ చేసుకుంటున్నారని పేర్కొంది. కథ నచ్చితే వెబ్సిరీస్లలో నటించడానికి అభ్యంతరం లేదని..ప్రస్తుతం ఉన్న సినిమా ఒప్పందాలతో ఓటీటీ ప్లాట్ఫామ్పై ఇప్పట్లో అడుగుపెట్టే ఆలోచన లేదని చెప్పింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తోంది.