దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ విజయాలకు చిరునామాగా మారింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గత మూడేళ్లుగా ఈ భామ తారాపథంలో దూసుకుపోతున్నది. రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. దీక్షిత్శెట్టి కథానాయకుడు. హృద్యమైన ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం ‘నదివే..’ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటకు స్వరాల్ని అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. రాకేందుమౌళి గీత రచన చేశారు. ‘ ‘నదివే నువ్వు నదివే, నీ మార్పే రానుంది వినవే, నదివే నువ్వు నదివే, నీకే నువ్వియ్యాలి విలువే, సిలువ బరువేమోయక, సులువు భవితే లేదుగా, వెన్నెల వలదను కలువవు నువ్వు కావా, కాలేవా..’ అంటూ హృద్యమైన భావాలతో సాగిందీ పాట. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.