సినీతారల ప్రజాదరణను, అభిమానగణాన్ని కొలవడానికి సోషల్మీడియా వేదికలు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. తిరుగులేని పాపులారిటీ కలిగిన తారలెవరో నిర్ణయించడానికి పలు సంస్థలు సోషల్మీడియా గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ కోవలో ప్రఖ్యాత సంస్థ ఫోర్బ్స్ వెల్లడించిన దక్షిణాది అత్యంత ప్రభావవంతమైన తారల్లో కన్నడ సోయగం రష్మిక మందన్న అగ్రభాగంలో నిలిచింది. ఆమె తర్వాత స్థానాల్లో విజయ్ దేవరకొండ, కన్నడ హీరో యష్, సమంత, అల్లు అర్జున్ ఉన్నారు. సోషల్మీడియా ఖాతాల్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య, పోస్ట్లకు వారు కొట్టే లైక్స్, వీడియో వీక్షణల సమయం…ఇలాంటి అంశాల ప్రాతిపదికన తారలకు రేటింగ్ను నిర్ణయించారు. ఇందులో రష్మిక మందన్న మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘కిరిక్పార్టీ’ చిత్రంతో కన్నడ చిత్రసీమలో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే తెలుగు భాషలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ఛలో, గీతగోవిందం, డియర్కామ్రేడ్, భీష్మ వంటి చిత్రాలు ఆమెకు తిరుగులేని అభిమానగణాన్ని సంపాదించిపెట్టాయి. ఇదే జోష్లో ఈ అమ్మడు తమిళ, హిందీ ఇండస్ట్రీల నుంచి అవకాశాల్ని సొంతం చేసుకుంది. ‘మిషన్మజ్ను’తో బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్లున్నాయి. చూడగానే ఆకట్టుకునే రూపలావణ్యం, ఏపాత్రలోనైనా మెప్పించే అభినయంతో ఈ భామ దక్షిణాది యువతరంలో మంచి ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది.