అందం అసలైన నేపథ్యమైనా…వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించే నాయికలే ఎక్కువకాలం ప్రేక్షకుల అభిమానం, అవకాశాలు పొందుతారు. తానూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నానంటున్నది రాశీ ఖన్నా. ఇప్పటిదాకా తనను సరదా అమ్మాయి పాత్రల్లోనే చూశారని, ఇకపై సీరియస్ క్యారెక్టర్స్లోనూ ఆకట్టుకుంటానని చెబుతున్నది. గతేడాది తెలుగు, తమిళ పరిశ్రమల్లో నాలుగు చిత్రాల్లో నటించినా ఆమెకు విజయం దక్కలేదు. అయినా తాజాగా వెబ్ సిరీస్ ‘ఫర్జి’ ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో ఆర్బీఐ ఆఫీసర్ మేఘా వ్యాస్గా నటించి మెప్పించింది. గతంలో తను అజయ్ దేవగణ్ ‘రుద్ర’ సిరీస్లోనూ ఇంటెన్స్ పాత్రలో ఇంప్రెస్ చేసింది.
ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ…‘బబ్లీ క్యారెక్టర్స్లో నన్ను చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటిదాకా ఇష్టపడ్డారు. నాకూ అలాంటి అవకాశాలే వచ్చాయి. నటిగా వైవిధ్యం చూపించాలంటే వీటికి భిన్నమైన పాత్రలు చేయాలి. వెబ్ సిరీస్ల ద్వారా అలాంటి క్యారెక్టర్స్లో నటించే వీలు దొరుకుతున్నది. నా దృష్టిలో నటించేందుకు ఓటీటీ, సినిమా అనే బేధం లేదు. పాత్రను బట్టి ఆ స్వభావాన్ని తెరపై ప్రదర్శిస్తా. ఇకపై ఇంటెన్స్ క్యారెక్టర్స్లోనూ నన్ను తెరపై చూస్తారు’ అని చెప్పింది. ప్రస్తుతం రాశీ ఖన్నా బాలీవుడ్లో ‘యోధ’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు.