అలుపెరుగని వృత్తి వ్యవహారాల్లో కాస్త విరామం హృదయాన్ని సేదతీరుస్తుంది. తనువు, మనసు పునరుత్తేజం పొంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి శక్తినిస్తుంది. అందుకే షూటింగ్లతో తీరికలేకుండా గడిపే సినీతారలు ఏమాత్రం గ్యాప్ దొరికినా విహారయాత్రలకు వెళ్లిపోతారు. పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా అలాంటి విరామ తరుణం కోసం కల కంటున్నది. ప్రస్తుతం ఈ సొగసరి తమిళ చిత్రం ‘చిరుచిత్రాంబళమ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. ఈ సినిమా షూటింగ్లో కునుకు తీస్తూ ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘షూటింగ్ గ్యాప్లో చిన్న కునుకు తీస్తూ విహారయాత్ర గురించి కలలు కంటున్నా’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు రాశీఖన్నా బిజీ జీవితం పట్ల కాస్త సానుభూతిని వ్యక్తం చేస్తూ త్వరగా షూటింగ్స్ అన్నీ ముగించుకొని స్వేచ్ఛా విహారానికి వెళ్లిపో అంటూ అనునయిస్తున్నారు.