Sai pallavi | దక్షిణాది కథానాయికల్లో సాయిపల్లవి పంథాయే వేరు. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాయిపల్లవి ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో ఏదో కొత్తదనం ఉందని ప్రేక్షకులు భావిస్తారు. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్న ఈ తమిళ సోయగం ‘రామాయణం’ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ముంబయిలో వేసిన భారీ అయోధ్య సెట్లో త్వరలో షూటింగ్ను మొదలుపెట్టబోతున్నారు. జూలై నెలలో ఈ సినిమా సెట్స్లోకి సాయిపల్లవి అడుగుపెట్టబోతుందని తెలిసింది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో అమీర్ఖాన్ తనయుడితో కలిసి ఓ సినిమా చేయబోతున్నది సాయిపల్లవి. హిందీలో ఒక్క సినిమా రిలీజ్ కాకముందే సాయిపల్లవి తిరుగులేని క్రేజ్ను సంపాదించుకుందని అంటున్నారు. కొందరు దర్శకనిర్మాతలు భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ ఈ భామతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే కెరీర్లో ఏనాడు తాను రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదని, కథకే తొలి ప్రాధాన్యత అని చెబుతూ వారి ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నదట సాయిపల్లవి. కథల ఎంపికలో తాను కొన్ని ప్రమాణాలను పాటిస్తానని, ఆ విషయంలో మాత్రం రాజీపడేది లేదని తేల్చిచెబుతున్నదట ఈ అమ్మడు. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో నాగచైతన్య సరసన ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నది.