అది 1870ల మధ్యకాలం. బ్రిటీష్ పాలకుల అనుచిత నిర్ణయాల వల్ల దక్షిణభారతాన్ని మహాకరువు కుదిపివేసింది. ఆకలి బాధతో దాదాపుగా 80లక్షల మంది అసువులు బాసిన చీకటి చరిత్ర అది. అందుకే ఆ మహాకరువుని ‘డొక్కల కరువు’గా కొందరు కవులు అభివర్ణించారు. ప్రజల అవసరాల కంటే అదాయ సేకరణే పరమావధిగా భావించిన బ్రిటీష్ పాలకులు, ప్రజల సంక్షేమార్థం విడుదల చేయాల్సిన నిధుల వ్యయాన్ని తగ్గిస్తూ తీసుకున్న కఠినమైన నిర్ణయం వల్ల మద్రాస్ ప్రెసిడెన్సీ తీవ్ర పేదరికంతో అతలాకుతలమైంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఈ విపత్తును తీవ్రంగా ఎదుర్కొన్నది. ఈ ఆకలి కేకల నుంచి తిరుగుబాటు మొదలైంది. బ్రిటీష్ దొరలు నిల్వ చేసిన ధాన్యాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి.
పన్నుల వసూళ్లను సైతం తిరుగుబాటు దారులు అడ్డుకున్నారు. ఈ ప్రజాపోరాటంలో అసువులు బాసిన మహావీరుల కథలు జానపద వీరగాధలుగా ప్రసిద్ధికెక్కాయి. ఆ మహావీరుల్లో ఒకరైన యోధుని స్ఫూర్తితోనే ‘రణబాలి’ సినిమా తెరకెక్కుతున్నట్టు సినీవర్గాల సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే అక్టోబర్ 16 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే.. ఈ సినిమా విడుదలయ్యే ఆ రోజే. ప్రజాపోరాటయోధుడు ‘రణబాలి’గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మక పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.