‘విరాటపర్వం’ చిత్రంలో తెలంగాణ పల్లెలు, అక్కడి యాస భాషల్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నటించడం గర్వంగా ఉంది’ అని చెప్పింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ఆమె రానాతో కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ఏపీలోని కర్నూల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. గాలిదుమారం, వర్షం వల్ల ఈ కార్యక్రమానికి తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం జుల్లుల్లో తడుస్తూనే చిత్ర బృందం ప్రసంగాల్ని పూర్తి చేశారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో నడిచే బలమైన కథ ఇది. దర్శకుడు వేణు ఊడుగుల తన రచనా పటిమతో కథకు పూర్తిగా న్యాయం చేశాడు. రానా సినిమా ఆరంభం నుంచి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు’ అని చెప్పింది. ‘ఈ చిత్రంలో సాయిపల్లవి వెన్నెల అనే అద్భుతమైన పాత్రను పోషించింది. ఈ సినిమాకు ఆమెనే హీరో అని చెప్పొచ్చు. ఇది వెన్నెల కథ’ అని రానా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1990 దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.