టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. కేసులో కీలక నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపగా, ఈ క్రమంలో ఒక్కొక్కరిని విచారిస్తుంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులని విచారించారు. నిన్న నందును పలు విధాల విచారించారు ఈడీ అధికారులు. ప్రధానంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎఫ్ క్లబ్తో ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.
విచారణలో భాగంగా రానా కొద్ది సేపటి క్రితం ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు. 2017 విచారణ జాబితాలో రానా పేరు లేదు. కానీ.. నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్కు రానా తరచూ వెళ్లేవారని, ఈడీ అధికారులు సమాచారం రాబట్టారు. అనేక ట్రాన్సాక్షన్స్ కూడా చేసినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ ..రానాకి కూడా నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో హైద్రాబాద్లోని ఓ హోటల్ నుండి తన ఆడిటర్లతో కలిసి రానా ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు.
రానా ఖాతాలతో పాటు రానా కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ సంస్థ నుండి డ్రగ్స్ సరఫరా కోసం నిధులు బదిలీ చేశారా అనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. నవదీప్, రానా మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై కూడ ఈడీ దర్యాప్తు చేయనుంది. రేపు హీరో రవితేజతో పాటు.. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.