బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భూల్ భులైయా 2’. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాని తెలుగులో రిమేక్ చేయాలని భావించారు దర్శకుడు రమేష్ వర్మ. ఫ్యాన్సీ రేటుకి రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ పనులని కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడీ సినిమాని పక్కన పెట్టి ఓ సూపర్ హిట్ సీక్వెల్ ని తెరపైకి తెచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో గుర్తుండిపోయే విజయం ‘రాక్షసుడు’. రమేష్ వర్మ దర్సకత్వంలో తమిళ ‘రాచ్చసన్’కి రీమేక్గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘రాక్షసుడు 2’కి రంగం సిద్దమైంది. బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ ‘రాక్షసుడు 2 చేయబోతున్నారు. ‘రాచ్చసన్’ కి సీక్వెల్ తమిళ్ లో ఇంకా రాలేదు. అయితే రమేష్ వర్మ చెప్పిన కథ బెల్లంకొండకి చాలా నచ్చింది. అదే ఫ్రాంచైజ్ పై ఈ కథ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ‘భూల్ భులైయా 2’ రిమేక్ ని పక్కన పెట్టి `రాక్షసుడు 2`ని మొదలుపెడుతున్నారు.