రామారావు ప్రభుత్వ ఉద్యోగి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఏ మాత్రం సహించడు. న్యాయం కోసం ధిక్కార స్వరం వినిపించే అతని జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు, వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించిన తీరు ఏమిటో తెలుసుకోవాలంటే ‘రామారావు ఆన్ డ్యూటీ’ చూడాల్సిందే అని అంటున్నారు శరత్ మండవ. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్డ్యూటీ’. జూన్ 17న విడుదలకానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ ఈ నెల 10న విడుదలకానుంది.
రవితేజ, రజిషా విజయన్లపై స్పెయిన్లో ఈ పాటను చిత్రీకరించామని, రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. టీజర్, పోస్టర్కు మంచి స్పందన లభిస్తున్నదని, యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, ఆర్ట్: సాహి సురేష్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, రవితేజ టీమ్ వర్క్స్, కథ; స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.