‘నందమూరి బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ అనే సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను’ అన్నారు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, నిర్మాత సి.కల్యాణ్. నేడు ఆయన జన్మదినం సందర్భంగా గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘ వచ్చే సంవత్సరం చెన్నయ్లో నిర్మాణంలో వున్న కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ను ప్రారంభించబోతున్నాను. తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ని చేపట్టాను. త్వరలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సపోర్ట్తో గోవా ఫిల్మ్ ఫెస్టివల్కు మించి అవార్డ్స్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరిలో ఇది ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో 30 రోజులు షూటింగ్ ఆపడం అనేది అట్టర్ ఫ్లాప్ షో. దాని వల్ల వచ్చిన ప్రయోజనమేమి లేదు. ఆ సమయంలో గుర్తించిన సమస్యలు, లోపాలు ఎవరూ అమలుపరచడం లేదు.
ఈ రోజు సినిమా పరిశ్రమ బతికుందంటే ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే రెండు వందల మంది నిర్మాతల వలనే అనేది నా అభిప్రాయం. నేడు ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి. నాకున్న అనుభవం ప్రకారం ఇతరులకు కీడు చేయాలని అనుకునే వాళ్లు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్లు ఇచ్చినా ఫైనల్గా జీరోలుగానే వెళ్లారు. కానీ ఎవరూ హీరోగా వెళ్లలేదు. ప్రస్తుతం ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. త్వరలోనే మూడు చిన్న చిత్రాల్ని ప్రారంభించోతున్నాను’ అన్నారు.