ముంబై : క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎన్సీబీ క్లీన్చిట్ ఇచ్చింది. ఆర్యన్పై ఆరోపణలకు తగిన ఆధారాలు లభించనందున అతడిని కేసు నుంచి తప్పించినట్టు ఎన్సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ బయటపడటంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ అమాయకులను దర్యాప్తు ఏజెన్సీలు ఎలా వేధిస్తాయో ఆర్యన్ ఖాన్ కేసు వెల్లడించిందని వ్యాఖ్యానించారు.
సెలబ్రిటీ కుమారుడి కేసులో ఏజెన్సీల అసమర్ధత బట్టబయలైందని చురకలు వేశారు. ఆయా ఏజెన్సీలు అమాయకులను వేధిస్తూ ఎంతటి దుందుడుకుగా, అసమర్ధతతో వ్యవహరిస్తాయో సామాన్య ప్రజలకు తెలియచెప్పేలా ఈ కేసు ద్వారా బహిర్గతమైందని వర్మ పేర్కొన్నారు. కాగా, ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను గత ఏడాది అక్టోబర్లో అరెస్ట్ చేశారు.
న్యాయస్ధానాల్లో వాదోపవాదాలు, 26 రోజుల పాటు కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బాంబే హైకోర్టు ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది. ఆపై తన తండ్రి బర్త్డేకు ముందు అక్టోబర్ 30న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చాడు. క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా 19 మందిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.