టికెట్ రేట్ల పెంపుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ. చర్చలు సంతృప్తిగా ముగిశాయని ప్రకటించిన ఆయన అందుకు భిన్నంగా వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల్ని సంధించారు. గంట వ్యవధిలో ఆయన 24 ట్వీట్లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా టికెట్ ధరల మాదిరిగానే మరే ఇతర ఉత్పత్తులపై ప్రభుత్వం నిబంధనల్ని విధించిందా? 500కోట్లతో రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కోటితో తీసిన చిన్న సినిమాకు ఎలా సమానమైన టికెట్ ధరను నిర్ణయిస్తాం? బెనిఫిట్ షోలకు ఎక్కువ రేటు పెట్టినప్పటికీ ప్రజలకు కొనుగోలు శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? అని వర్మ ప్రశ్నించారు. 70ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసివేసిందని..దీనిని కోర్టులో సవాలు చేయాలని వర్మ సూచించారు. ‘రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ను మహారాష్ట్ర ప్రభుత్వం 2200 రూపాయలకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. సొంత రాష్ట్రం ఏపీ మాత్రం కనీసం 200లకు కూడా అమ్ముకోవద్దని అంటున్నది. ఇది అస్తిత్వానికి ఎదురవుతున్న ప్రశ్న..‘హూ కిల్డ్ కట్టప్ప’ (కట్టప్పను చంపిందెవరు’) అంటూ రామ్గోపాల్వర్మ చేసిన వరుస ట్వీట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.