‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల తర్వాత కెరీర్ గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు లైనప్ చేసుకుంటున్నారు స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన ఇటీవలే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఏపీలోని కర్నూలు, రాజమండ్రి తదితర ప్రదేశాల్లో జరుపుకుంటున్నది. ఈ సినిమా చేస్తూనే రామ్ చరణ్ మరో కొత్త చిత్రానికి అంగీకారం తెలిపారట. కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ నచ్చిన చరణ్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. నర్తన్ ‘మఫ్టీ’ అనే బ్లాక్బస్టర్ మూవీని తెరకెక్కించి కన్నడ పరిశ్రమలో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమా అతనికి గుర్తింపు తీసుకొచ్చింది. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్లో దర్శకులు పరిశ్రమలకు అతీతంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ దర్శకులపై మన స్టార్ హీరోలకు నమ్మకం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే చరణ్ నర్తన్ మూవీకి అంగీకారం తెలిపారని అనుకోవచ్చు.