Game Changer | రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
దర్శకుడు శంకర్ ‘గేమ్ఛేంజర్’తో పాటు కమల్హాసన్ ‘ఇండియన్-2’ చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆయన ‘గేమ్ఛేంజర్’ చిత్రం కోసం పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని, ఈ కారణంగా షూటింగ్ కూడా ఆలస్యమవుతున్నదని చెన్నై సినీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో ‘గేమ్ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అంటున్నారు. సమకాలీన రాజకీయాంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: దిల్రాజు-శిరీష్, దర్శకత్వం: శంకర్.