బాలీవుడ్ చిత్రసీమలో ధడక్, గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ వంటి చిత్రాలతో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకుంది జాన్వీకపూర్. ఆమె తాజా చిత్రం ‘మిలీ’ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఈ భామ దక్షిణాది అరంగేట్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే..రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీకపూర్ పేరును పరిశీస్తున్నారని సమాచారం. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా దక్షిణాది అరంగేట్రం ఖరారు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న జాన్వీకపూర్ ఈ సినిమాపై ఆసక్తిగా ఉందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.