న్యూఢిల్లీ : జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ ఇరాన్ మహిళ ఫిర్యాదు ఆధారంగా అదిల్పై మైసూర్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అదిల్ తనను మోసగించాడని భార్య రాఖీ సావంత్ ఫిర్యాదు చేయడంతో అతడిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
కాగా, తాము మైసూర్లో నివసిస్తున్న క్రమంలో పెండ్లి చేసుకుంటానని మభ్యపెడుతూ అదిల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వీవీ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకోవాలని అయిదు నెలల కిందట తాను ఒత్తిడి చేయగా తిరస్కరించిన అదిల్ పలువురు అమ్మాయిలతో తనకు ఈ తరహా సంబంధాలు ఉన్నాయని చెప్పాడని ఆమె ఆరోపించింది.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వెల్లడిస్తానని అదిల్ బెదిరించడంతో పాటు బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. అదిల్ తనను మోసగించాడని రాఖీ సావంత్ ఇటీవల విలేకరుల ఎదుట కన్నీరమున్నీరు అయింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు అదిల్ను పిలిపించిన ఓషివర పోలీసులు ఆపై అతడిని అరెస్ట్ చేశారు. అదిల్తో గతంలో తనకు వివాహమైందని, అయితే అతడు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు నడుపుతూ తనను బ్లాక్మెయిల్కు గురిచేస్తున్నాడని రాఖీ సావంత్ ఆరోపిస్తున్నారు.