సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తె షూటింగ్ సమయంలో అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో సారి ఆయన ఆసుపత్రిలో చేరడం అభిమానులలో ఆందోళన కలిగించింది. రజనీకాంత్ ఆరోగ్యంకి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా కావేరి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించినట్టు తెలిపారు. ఆ బ్లాక్స్ని తొలగిస్తున్నట్టుగా పేర్కొన్న వైద్యులు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని అన్నారు.
70ఏళ్ల యాక్టర్ రజనీకాంత్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ చలనచిత్ర అవార్డు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ఆయన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డుల కార్యక్రమానికి రజనీకాంత్, ఆయన కూతురు, అల్లుడు, ఐశ్వర్య, ధనుశ్లతో కలిసివెళ్లారు. అవార్డు స్వీకరించిన తర్వాత రజనీకాంత్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను కలిసి తిరిగి వచ్చారు.