‘మా కుటుంబ సభ్యులు ప్రజలు మెచ్చే మంచి సినిమాలే తీస్తారు. ఈ మధ్యే ఈ సినిమా చూశా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి. గురువారం జరిగిన ‘అతిథి దేవోభవ’చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిసాయికుమార్, సువేక్ష జంటగా నటించిన ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాతలు. నేడు విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆది చేసిన గత చిత్రాలకంటే పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రథమార్థం వినోదంతో, ద్వితీయార్థం ఎమోషన్తో మెప్పిస్తుంది. హృదయాన్ని తడిమే ఉద్వేగాలుంటాయి’ అన్నారు. ‘ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎంతగానో శ్రమించాం.
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిందని తెలిసి బాధపడ్డాను. అదే రోజు మా సినిమా విడుదల కావడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. అందమైన ప్రణయగాథగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అందరు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని ఆది సాయికుమార్ చెప్పారు. సాయికుమార్తో తమ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని.. ఆయన కుమారుడు ఆది చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని రాజశేఖర్జీవిత దంపతులు ఆకాంక్షించారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా విజయం తథ్యమనే భావన కలిగిందని యువహీరో కార్తికేయ చెప్పారు. కథానుగుణంగా ఈ సినిమాకు మంచి సాహిత్యాన్నందించే అవకాశం లభించిందని గీత రచయిత భాస్కరభట్ల పేర్కొన్నారు. ఆదితో తన కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందని..ఈ సినిమా పుష్కలమైన వినోదంతో అలరిస్తుందని సప్తగిరి చెప్పారు.