Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి తీసిన చిత్రాలలో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాలేదు. ఆయన తీసిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. అయితే ఇంత ప్రభంజనం సృష్టించిన బాహుబలి ఫ్రాంచైజ్ చిత్రాలు కూడా తన కెరీర్లో బెస్ట్ చిత్రాలు కాదంటూ పెద్ద బాంబ్ పేల్చాడు జక్కన్న.ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘జూనియర్’. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాజమౌళి, తన కెరీర్లో ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సినిమా ‘ఈగ’ అని చెప్పారు.RRR షూటింగ్ సమయంలో ‘స్టూడెంట్ నెం.1’ లొకేషన్స్కు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఒక పాత ఫోటోను రీ క్రియేట్ చేసుకున్నట్టు పేర్కొన్నాడు. “సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీయాలని అందరూ భావించారు. కానీ ‘సై’తో ఆ అంచనాలన్నీ బ్రేక్ చేసి, యూత్ఫుల్ సినిమా తీసాం. నచ్చిన కథకు తగ్గట్టుగా సినిమాలు తీయొచ్చని అర్థమైంది అని తెలిపారు. ఇక సాయి కొర్రపాటి మొదట ఈ సినిమాని చిన్న సినిమాగా ప్రారంభించారు. కానీ కాస్టింగ్ చూస్తే – శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్.. ఇలా ఒక్కొక్కరు చేరుతూ సినిమా స్థాయి పెరిగింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇవన్నీ కలవడంతో ఇది పెద్ద సినిమాగా మారింది అని రాజమౌళి చెప్పారు. ‘వైరల్ వయ్యారి’ పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట ఎంత క్రేజ్ తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది అని అన్నారు. ఇక జెనీలియా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. ఈ సినిమాలో కొత్త జెన్నీని చూస్తారని సెంథిల్ ప్రామిస్ చేసారు. దాని కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని రాజమౌళి అన్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్తో పాటు చిత్ర బృందంపై కూడా రాజమౌళి ప్రశంసలు కురిపించారు.