‘నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం, ప్రేక్షకులు బాగుంటేనే సినీ పరిశ్రమ క్షేమంగా ఉంటుంది. సినిమా టికెట్ల ధరలను, షోస్ను తగ్గించడం వల్ల వీరందరూ నష్టపోయే ప్రమాదముంది’ అని అన్నారు సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ టికెటింగ్ విధానంపై బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘ఒక హిట్ సినిమాకు ఎక్కువ షోస్ వేయడం..మొదటివారంలో టికెట్ రేట్స్ పెంచుకోవడం వల్ల థియేటర్ల యాజమాన్యం, వాళ్లను నమ్ముకున్న కొన్ని వేల మందికి రెండు, మూడు నెలలకు సరిపడా ఆదాయం వస్తుంది. వంద సినిమాలలో పదిశాతం హిట్స్, పదిశాతం యావరేజ్ సినిమాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన సత్యం. ఆన్లైన్ విధానం వల్ల దోపిడి ఆగిపోతుందనడం కరెక్ట్ కాదు. సామాన్యుడికి వినోదాన్ని పంచేది సినిమా ఒక్కటే. టికెట్ రేట్స్, షోస్ నిర్ణయంతో చాలా మంది నష్టపోతారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ ధర మూడు వందలు అయినా ఐదు వందలు ఉన్నా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. ఆన్లైన్ విధానం వల్ల పలుకుబడి ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకొని వాళ్ల శిష్యుల ద్వారా టికెట్లను బ్లాక్లో అమ్మవచ్చు. అదే టికెట్ రేట్లు పెంచి ఆన్లైన్లో అమ్మితే థియేటర్ల వలన ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు వస్తాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.