Radheshyam digital-satilite rights | బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ ఈయనకు విపరీతైమన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఈయన సినిమాలు టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే సాహో సినిమాతో అది రుజువైంది కూడా. ప్రభాస్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆయన కథ ఒప్పుకుంటే చాలు బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. దీనికి తగ్గట్టు ప్రభాస్ కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఒప్పుకున్న సినిమాలకు 2000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా. ఇదిలా ఉంటే ఈయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యూవీ సంస్థ నిర్మిస్తున్న రాధేశ్యామ్ చిత్రానికి దాదాపు 350కోట్ల వరకు బడ్జెట్ అయిందట. అయితే తాజాగా ఈ చిత్రానికి డిజిటల్ శాటిలైట్ హక్కులు అన్ని భాషలు కలుపుకొని రూ. 250కోట్ల భారీ ధరకు డీల్ కుదిరిందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే నిర్మాతలకు ఇప్పటికే 70 శాతం రిటర్న్స్ వచ్చినట్టే. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సలార్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న సలార్ చిత్ర పార్ట్-1 ను ఈఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్-K సెట్స్ పైన ఉండగా.. సందీప్రెడ్డి తెరకెక్కిస్తున్న స్పిరిట్ ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ మరో రెండుమూడేళ్ల వరకు బిజీగానే ఉండేటట్లు కనిపిస్తుంది.