హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తో తన సినిమా జర్నీ మొదలుపెట్టిన కథానాయిక రాశీ ఖన్నా.. దాదాపు పదేండ్ల తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టింది. ‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి టాప్ హీరోయిన్గా ఎదిగింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న ‘యోధ’ చిత్రంలో నటిస్తున్నది.
దీంతోపాటు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, అమోల్ పాలేకర్తో కలిసి ‘ఫర్జీ’ వెబ్సిరీస్ చేస్తున్నది. ఫిబ్రవరి 10 నుంచి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రాశీ పంచుకున్న అనుభవాలు ..
‘ఫర్జీ’లో నా పాత్ర కొత్తగా కనిపిస్తుంది. నకిలీ నోట్ల రహస్యాలను ఛేదించే అధికారిగా నటించాను. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది. స్క్రిప్ట్ చదివాక నకిలీ మనీ చలామణి ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం కలిగింది. ఈ సిరీస్ చూశాక చాలా సమాచారం తెలుసుకోవచ్చు. మనచుట్టూ జరుగుతున్న నేరాలపై అవగాహన కలుగుతుంది. నకిలీ కరెన్సీని గుర్తుపట్టడం కష్టమే!
నేను నటిస్తున్న రెండో వెబ్ సిరీస్ ఇది. ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’ సిరీస్తో నాకు మంచి పేరు వచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి శారీరకంగా దృఢంగా ఉండటం అవసరం. అందుకు తగ్గట్టు వ్యాయామాలు చేస్తుంటాను. జిమ్లో ఐదారు గంటలు కసరత్తులు చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే బేసిక్ ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తాను.
ఈ సిరీస్లో షాహిద్, విజయ్ సేతుపతితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. హిందీ కావడంతో విజయ్ సేతుపతికి భాషా పరమైన ఇబ్బంది వస్తుందేమో అనుకున్నా! కానీ, ఆయన దానిని అధిగమించిన తీరు అద్భుతం. నటుడికి భాషా భేదాలు ఉండవని నిరూపించారు.