Rashi Khanna | “ఫర్జీ’ సిరీస్లో బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘా పాత్రను పోషించాను. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్లో షాహిద్కపూర్, విజయ్సేతుపతి ప్రధాన పాత్రల్ని పోషించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా రాశీఖన్నా పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ “రుద్ర’ తర్వాత హిందీలో నా రెండో సిరీస్ ఇది. కథ చెప్పిన తర్వాత నకిలీ కరెన్సీ గురించి కొంత సమాచారం సేకరించా. ప్రతి ఐదు నోట్లలో ఒకటి ఫేక్ కరెన్సీ ఉంటుందని తెలిసింది. సినిమాలతో పోల్చితే వెబ్సిరీస్లలో భావోద్వేగాల్ని మరింత బలంగా ఆవిష్కరించే వీలుంటుంది. అయితే పెద్ద తెర మీద సినిమా చూడటాన్ని మించిన అనుభవం ఏదీ ఉండదు.
ఈ సిరీస్లో షాహిద్కపూర్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్తో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. సినిమాలు, వెబ్సిరీస్లలో సమాంతరంగా నటించడం అంత కష్టంగా అనిపించడం లేదు. ఎక్కడైనా షూటింగ్ వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. తెలుగులో నాలుగు ప్రాజెక్ట్లు చర్చల దశలో ఉన్నాయి. మరో నెలరోజుల్లో వాటి వివరాల్ని వెల్లడిస్తా. ప్రస్తుతం పెళ్లికి ఎలాంటి తొందర లేదని అనుకుంటున్నా. సినిమాల్లో బిజీగా ఉన్నా. ఒకవేళ పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా చెబుతా. కెరీర్లో బాధపడిన సందర్భాలు ఏమీ లేవు. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భిన్న పాత్రల్ని పోషించడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం సిరీయస్గా సాగే ఛాలెంజింగ్ రోల్స్ మీద దృష్టి పెడుతున్నా’ అని చెప్పింది.