కరోనా మహమ్మారి వల్ల సమాజంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ప్రతి సంక్షోభంలోనూ మానవాళి నేర్చుకునే గొప్ప విషయాలు ఎన్నో ఉంటాయని చెప్పింది కథానాయిక రాయ్లక్ష్మీ. లాక్డౌన్ వల్ల నియంత్రిత జీవనం గడుపుతున్నామనే భావనను వదిలేసి, ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం సోషల్మీడియా వేదికగా నెగెటివ్ వార్తల్ని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారని..కొద్ది మాసాలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం మానసిక ఆరోగ్యానికి మంచిదని సలహా ఇచ్చింది రాయ్లక్ష్మీ. ఆమె మాట్లాడుతూ ‘ఈ విషాద పరిస్థితుల వల్ల చాలా మందికి జీవితం విలువ అంటే ఏమిటో తెలిసొచ్చింది. ఇతరుల కష్టాల్ని మానవీయ కోణంలో చూసే ధోరణి పెరిగింది. ప్రజల్లో సమాజం పట్ల బాధ్యత, పరస్పర సహకార గుణం ఎక్కువైంది. సామూహిక పోరాటంతోనే కరోనాను తరిమికొట్టొచ్చనే నమ్మకం పెరిగింది. ఇవన్నీ ఈ సంక్షోభం నేర్పిన మంచి విషయాలే. అదే సమయంలో లాక్డౌన్ పరిస్థితుల్ని చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి..కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. నేను యోగాపై దృష్టిపెట్టడంతో పాటు మా అపార్ట్మెంట్ కమ్యూనిటీతో కలిసి కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ లాక్డౌన్ సమయాన్ని ఆస్వాదిస్తున్నా’ అని చెప్పింది.