ఒక్క సూపర్ హిట్ సినిమా తారలు ఏండ్లపాటు కొనసాగే కెరీర్నిస్తుంది. కన్నడ తార రష్మిక మందన్నకు అలా దక్కిన విజయమే ‘పుష్ప, ది రైజ్’. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న పాండమిక్ భయాల మధ్య విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాధించిన సక్సెస్ ఈ నాయికకు స్టార్డమ్ తీసుకొచ్చింది.
బాలీవుడ్ సహా ఇతర భాషల్లోనూ ఆమెకు అవకాశాలు సంపాదించి పెట్టింది. అందుకే ఈ సినిమా రష్మికకు స్పెషల్ మూవీ అయ్యింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా స్పందించిందీ అందాల భామ. ‘పుష్ప సినిమా షూటింగ్ నిన్నే జరిగినట్లు అనిపిస్తున్నది. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా సెట్లో మేము పొందిన అనుభవాలు ఎప్పటికీ గుర్తుంటాయి. సుకుమార్ లాంటి దర్శకుడితో పనిచేయడం మర్చిపోలేను. ‘పుష్ప -2’ తో మరో సూపర్హిట్ కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం రష్మిక మందన్న ‘వారసుడు’, ‘మిషన్ మజ్ను’, ‘యానిమల్’ చిత్రాల్లో నటిస్తున్నది.