Pushpa-2 | ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో వేగం పెంచారు. బుధవారం ఈ చిత్రం నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ పాట ప్రోమో సోషల్మీడియాలో ట్రెండింగ్గా మారిన విషయం తెలిసిందే. ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ స్వరాలను సమకూర్చగా చంద్రబోస్ రచన చేశారు. పుష్పరాజ్ మీద శ్రీవల్లి మనసులోని ప్రేమను, ఆరాధనా భావాన్ని వ్యక్తం చేస్తూ చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకుంటున్నది.
‘వీడు మొరటోడు అని వాళ్లు వీళ్లు..ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నా వాడు..వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్నాగానీ మహరాజు నాకు నా వాడు..ఓ మాట పెలుసైనా..మనసు వెన్న..రా యిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసు నా కన్నా.. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉం టాడే నా సా మీ..మెత్తానీ పత్తిపువ్వులా మరి సంటోడే నా సా మీ’ అంటూ అద్భుతమైన భావాలతో ఈ పాట సాగింది. ఐదు భాషల్లో శ్రేయా ఘోషల్ ఆలపించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.